Amman

Amman
Nitya subha mangalam

Thursday, October 17, 2013

శ్రీశైల భ్రమరాంబికా భజ మనః శ్రీ శారదా సేవితాం 1

శ్రీశైలం - నాకు తెలియకుండానే నన్ను అమ్మవారి ధ్యాస వైపు నడిపించి నా జీవితంలో వెలుగులు నింపిన అతి పవిత్రమైన ప్రదేశం.

భౌతికంగా శ్రీశైలం చూడక ముందు కూడా అది నాకెంతో సుపరిచితమైన ప్రదేశంగా తోచేది. నేను తప్పకుండా శోధించి తెలుసుకోవాల్సిన గొప్ప సత్యం / రహస్యం ఏదో శ్రీశైలంలో ఉన్నట్టు ఒక అస్పష్టమైన ఊహ నా మనసులో ఉండేది. పెళ్లి అయిన కొత్తలో తొలిసారి ప్రాపంచికమైన మేలు ఆశించి శ్రీశైల క్షేత్రంలో అడుగు పెట్టాను. నా  జీవితంలో శుభం, నా సంతానం - ఇవన్నీ శ్రీశైల క్షేత్ర దర్శనం తర్వాత నాకు కలిగిన గొప్ప భాగ్యాలు.



కానీ, వీటి అన్నిటి కన్నా భిన్నం అయినది, నా జీవన గమనాన్నే మార్చేది అయిన ఒక పెద్ద మార్పుకి బీజం శ్రీశైల క్షేత్రంలోనే పడింది. అది నాలో కొన్నాళ్ళు నిద్రాణమై చివరికి నా ఆత్మని మేలుకొలిపి - పరమాత్మ (అమ్మవారు) లో లీనం అవడానికి అడుగులు వెయ్యమని గొప్ప ప్రేరణనిచ్చింది.

నేటికీ లౌకికమైన జీవితంలో తలమునకలు అవుతూ అరిషడ్వర్గాలతో పోరాడుతూ - పాప పంకిలమైన మనసుతో, వాక్కుతో జీవిస్తూ ఉన్నా సరే, ఇంకా ఏదో ఒక మూల నన్ను నేను ఉద్ధరించుకోమనే ప్రేరణను బలంగా నిలిపి నాలో జ్యోతిని నిరంతరం వెలిగిస్తోంది నా అమ్మ - భ్రమరాంబిక. నా సామాన్య జ్ఞానానికి అంతు చిక్కని మల్లికార్జున స్వామివారి తత్వాన్ని అణువంత అయినా అర్థం చేసుకోవడానికి నన్ను సంసిద్ధ పరుస్తూ, నన్ను ఒడిలో కూర్చుండబెట్టుకుని జ్ఞాన భిక్ష అనుగ్రహించబడేలా నన్నుసిద్ధం చేస్తోంది మా అమ్మ భ్రమరాంబ.

అమ్మ నా ప్రాణం, అమ్మ నా లోకం.

ఇరవై ఆరేళ్ళు కన్నూ మిన్నూ కానకుండా అహంకారంగా తిరిగి, అమ్మ ధ్యాస ఏ మాత్రం లేకుండా మెలిగి - అనేక పాపాలు పోగు చేసుకుని కూర్చున్న నాకు - జీవితం అంటే ఏమిటి, జీవిత పరమావధి ఏమిటి అని అర్థం చేసుకోమనే ధ్యాస ఇచ్చింది నా జనని శైలపుత్రి. అంత వరకు నేను జీవించిన జీవితంలో పెద్ద రుచి లేదు అనిపించింది. నిజమైన ఆత్మానందం కోసం నా అన్వేషణ అలా మొదలయ్యింది.

తొలిసారి శ్రీశైల యాత్రలో అమ్మవారి ధ్యాస లేదు. తరువాత రోజుల్లో అమ్మవారి ధ్యాస మొదలైన దగ్గరి నుంచీ, శ్రీశైలం వెళ్లాలని  లోలోపల సంకల్పం చేసుకున్నా అయిదు సంవత్సరాల పాటు వెళ్ళలేకపోయాను - రకరకాల కారణాల వల్ల. మనసు ఎంతో పరితపించింది. నా వైష్ణవిని తీసుకు వెళ్లి అమ్మ ముందు నిలిపి - "అమ్మా! ఇదుగో నీ వర ప్రసాదం" అని చెప్పాలి అని చాలా సార్లు అనిపించింది. ఆ కోరిక తీరే రోజు దగ్గరకొచ్చింది. నా పుట్టినరోజు నెపంతో తీరిక చేసుకుని శ్రీశైలం వెళ్ళే ఏర్పాట్లు చేసుకున్నాం. మరీ ఎక్కువ ఆశ పడితే తర్వాత ఆశా భంగం అవుతుందేమో అని చాలా మనసుని అదుపులో పెట్టుకున్నాను (అని అనుకున్నాను). ఇన్ని సంవత్సరాల తర్వాత అమ్మవారిని, అయ్యవారిని చూడబోతున్నాను అన్న ఊహ నన్ను పట్టి కుదిపేసింది ఆనంద ఉద్వేగాలతో.




నాకు నల్లమల అరణ్యం మొత్తం శ్రీశైలం క్షేత్రం అని అనిపిస్తుంది. ఆ అరణ్యంలో జంతుజాలం, మనుషులు, చెట్టు, పుట్ట - అన్నీ పరమ పవిత్రం. నల్లమల అరణ్యం మొత్తం శివ శివానీ మయమ్. సామాన్యుల కంటికి కనిపించకుండా అనేక యోగులు, సిద్ధులు ఆ అరణ్యంలో స్వామి, అమ్మవార్ల గురించి తపస్సులో మునిగిపోయి ఉంటారట.  అరణ్య ముఖద్వారం అయిన మన్ననూరు చెక్ పోస్ట్ ని ఉదయం ఆరు గంటలకు దాటిన దగ్గర నుంచి దట్టమైన నల్లమలలో ఉత్సాహ భరితమైన ప్రయాణం. నెమళ్ళు, కోతులు స్వేచ్ఛగా తిరుగుతున్నాయి. దట్టమైన పొదల మాటు నుంచి జింక బయటికి వచ్చి పలకరించి పొదల్లోకి జారుకుంది. అలా గంట గడిచాక శ్రీశైల పర్వత తొట్టతొలి దర్శనం అయ్యింది.

అసలు శ్రీ పర్వతమే ఒక సంపూర్ణమైన శివ లింగ స్వరూపం. శ్రీశైలం గ్రామం ఉన్న ఆ పర్వతం పై భాగమే పానపట్టం (సాక్షాత్ అమ్మవారు), ఊరి మధ్యలో స్వామి గుడి లింగ స్వరూపం (సాక్షాత్ అయ్యవారు). పాతాళ గంగకి వెళ్ళే మెట్ల మార్గమే అభిషేక జలం లింగం నుంచి కిందకి జాలువారే మార్గం. స్వామి లింగ స్వరూపం మీద నుంచి జాలువారి ప్రవహించిన అభిషేక జలమే ఆ కృష్ణవేణమ్మ. శ్రీశైలం అణువు అణువు శివ స్వరూపం. శ్రీశైల దేవాలయం చుట్టూ ఉన్న ఊరిలో (శ్రీగిరి లింగానికి పానపట్టం) ఉండటం అంటే స్వయంగా అంబికా దేవి ఒడిలో పసి బిడ్డలా ఆడుకోవడమే. శ్రీశైల గ్రామంలో నివాసం ఉన్న రోజుల్లో మన శారీరకమైన,మానసికమైన ఎన్నో మలినాలను మనం విసర్జిస్తాము. రోజుల పసిబిడ్డ అమ్మ ఒడిలో ఉన్నప్పుడు శారీరక ధర్మం ప్రకారం మలినాలు విసర్జించడం లాంటిదే ఇది కూడా ! అయినా , శ్రీశైల తిరుమల పర్వతాల మీద అడుగు పెట్టబోయే ముందు పరమాత్మకి నమస్కారం చేసుకుని "తండ్రీ! ఈ యుగంలోని దుర్బలమైన మనుష్య ధర్మాన్ని అనుసరించి ఈ పవిత్రమైన పర్వతాన్ని అధిరోహించి నీ దర్శనార్థం కొంత సమయం ఉండబోతున్నాను, ఆ సమయంలో నా శరీర ధర్మ నిర్వహణ కోసం కొన్ని పనులు చేస్తాను. నన్ను క్షమించి నాకు దర్శనం ఇచ్చి నన్ను ఉద్ధరించు" అని ప్రార్థన చెయ్యాలి. 

దాదాపు గంటన్నర సేపు కొండల్లోనూ లోయల్లోనూ ప్రయాణించి, శ్రీశైలం ప్రాజెక్ట్ ఒక వైపు నుంచి రెండవ వైపుకి కృష్ణా నది మీద వంతెన దాటి వెళ్లి, పైకి పైకి ఎగబాకి చివరికి శ్రీశైల పర్వతాన్ని చేరుకుంటాం.



ఎదురుగా శ్రీశైల పర్వతం కనిపిస్తున్నట్టే ఉంటుంది. కాని గంటన్నర పైగా ఎత్తులు ఎక్కి పల్లాలు దిగి ప్రాణం విసిగిపోతూ ఉంటుంది. ఆ ప్రకృతి అతి అద్భుతం, మనిషి భౌతిక విజ్ఞాన శాస్త్రం పరమ అద్భుతం. ప్రతి మలుపు లోనూ ఒక గుడి లేదా ప్రార్థనా మందిరం. కొంత మంది కారణ జన్ముల, యోగుల ఆశ్రమాలు అక్కడక్కడా కనిపిస్తాయి. కొన్ని పరిశోధనా కేంద్రాలు నెలకొలిపి ఉన్నాయి. ఆ క్షణానికి ఇవి అన్నీ చూసి కొంత మనసు మురిసిపోయినా మల్లికార్జున స్వామి, అమ్మ భ్రమరాంబ దర్శనం ఇంకా ఎంత సేపటికి అవుతుంది అని ప్రాణం విసిగిపోతుంది. "ఇది కేవలం మన ఊరి నుంచి శ్రీశైలం వరకు చేసే ప్రయాణం కాదేమో, బహుశా ఆ పరమాత్మని చేరేందుకు మన ఆత్మ పడే తపనకి సూక్ష్మ రూపమేమో ?" అని మనసుకి తోచింది.


Saturday, July 6, 2013

ధర్మ యజ్ఞంలో - సమిధలు

  కొన్ని సంఘటనలు ఎందుకు జరుగుతాయో, కొన్ని జీవితాలు అంతు లేని దుఖాన్ని మాత్రమే చవి చూస్తూ ఎందుకు ఉంటాయో సామాన్య మానవుని ఆలోచనకి, విచక్షణకి అందదు.

భగవంతుడి సృష్టిలో ప్రతి ప్రాణికీ ఒక లక్ష్యం ఉంటుంది, ప్రతి జీవితానికీ ఒక గమ్యం ఉంటుంది. అతి కొద్ది మంది యోగులకి, జ్ఞానులకి మాత్రమే భగవంతుడి సృష్టిలో లీలలు అర్థం అవుతాయి.

శ్రీమద్రామాయణంలో రాముల వారు వనవాసానికి బయలుదేరినప్పుడు సీతా అమ్మవారు భర్తని అనుగమించారు. సాక్షాత్ శ్రీ మహా లక్ష్మి అమ్మవారు మానవ స్త్రీగా ఎన్నో కష్టాలు అనుభవించారు, భయానక సందర్భాలు ఎదుర్కొన్నారు, కృంగదీసే అవమానాలు భరించారు. అటువంటి మరొక పరమ సాధ్వీమణి ఊర్మిళ. భర్త లక్ష్మణుడు తన అన్నగారికి  తోడుగా వనవాసానికి వెళ్తుంటే, దుఃఖాన్ని దిగమింగి పంపారు. పదునాలుగు ఏండ్ల పాటు తీవ్రమైన ఒంటరితనాన్ని అనుభవిస్తూ నిద్రలో తన మొత్తం దుఃఖాన్ని దిగమింగుకున్నారు. రామావతార స్వీకారం ద్వారా భగవంతుడు చేయదలుచుకున్న ధర్మ సంస్థాపనలో తన వంతు కర్తవ్యమ్ తల్లి ఊర్మిళ ఇలా నెరవేర్చారు.

వేంకటనాథుడు రాఘవేంద్రస్వామి గా మారక మునుపు ఆయన ఒక గృహస్థు. భార్య బిడ్డడితో అతి దారుణమైన దారిద్ర్యాన్ని అనుభవించారు. ఆయన భార్య సరస్వతమ్మ భర్తని అనుగమించిన మహా ఇల్లాలు. కట్టు బట్టలు కూడా సరి అయినవి లేనంత కటిక దారిద్ర్యాన్ని భర్త సాన్నిధ్యమనే వెలుగులో అధిగమిస్తూ జీవనం సాగించారు. తరువాత రోజుల్లో వేంకటనాథుడు గురువు గారి ఆజ్ఞకి తలొగ్గి హఠాత్తుగా సన్యాసం, శ్రీ మఠం బాధ్యతలు స్వీకరించినప్పుడు సరస్వతమ్మ గారు ఆ నిజాన్ని జీర్ణించుకోలేక ఆత్మహత్య చేసుకున్నారు. భర్త తోడే లోకం గా బ్రతుకుతూ అతి భయంకరమైన పరిస్థితులు భరించిన మహా ఇల్లాలు, భర్త పక్కన లేని జీవితాన్ని ఊహించుకోలేక ఈ లోకాన్ని వదిలిపెట్టారు. ఆ సమయంలో దుఃఖంతో మరణించిన ఆమె ఆత్మ శాంతి లేక అలమటిస్తూ ఉంటే రాఘవేంద్ర స్వామి ఆమెకి సద్గతులు కలిగించారు. లోక కళ్యాణానికి తన భర్తని త్యాగం చేసిన ఆ సాధ్వి, తన త్యాగానికి ఫలంగా పరమపదం చేరారు.

లోకంలో పరమేశ్వరుడు ధర్మ సంస్థాపన చెయ్యడానికి, దీనులని ఉద్ధరించడానికి యుగాన్ని బట్టి, కాలాన్ని బట్టి అనేక అవతారాలు స్వీకరించాడు, అలాగే గురు పరంపరని నెలకొల్పాడు. మహా విష్ణువు దశావతారాలు మొదలుకొని ఆది శంకరాచార్యులు, షిరిడి సాయిబాబా, మీరాబాయి, శ్రీపాద వల్లభ స్వామి, శృంగేరి గురు పరంపర, కంచి గురు పరంపర, నృసింహ తీర్థ స్వామి, సత్య సాయిబాబా, రమణ మహర్షి, రాఘవేంద్ర స్వామి, శ్రీల ప్రభుపాదులు, అమృతానందమయి అమ్మ - అఖండ భారతావనిలో ఈ ధర్మోద్ధరణ కార్యాన్ని నిర్వహించడానికి ఎందరో కారణజన్ములు వచ్చారు.

ఒక ధర్మోద్ధరణ కార్యం ఒకరి వల్ల జరుగుతోంది అంటే, భగవంతుడు వారి ద్వారా తన లీలను ప్రకటితం చేశాడు అని అర్థం. అలా తన లీలని ప్రకటితం చెయ్యడానికి ఆయన ఒకరిని ఎంచుకోవాలంటే వారు అనంతమైన పుణ్యం చేసి ఉండాలి. ఆ పుణ్యం వారు ఒక్కరిదే కాదు - ఆ ఎంచుకోబడిన వారి జీవితంలో అనేక సందర్భాల్లో తోడుగా నిలిచిన వారు, గురువులు, వారి పూర్వీకులు, కన్నవారు, తోడ బుట్టినవారు, జీవిత భాగస్వామి, బిడ్డలు - ఇంకా అనేక మంచి చెడులకు ప్రత్యక్షంగా పరోక్షంగా దోహదం చేసినవారు - ఇలా ఎంతో మంది పుణ్యఫలాలు కలిసి - ఆ వ్యక్తి  ద్వారా ప్రకటితం అయ్యి ఉంటాయి.

ప్రతి యుగంలోనూ ఎన్నో ధర్మ యజ్ఞాలు, యజ్ఞ కర్త భగవంతుడు, యాగాగ్నిగా ఎందరో సత్పురుషులు. యాగాగ్నులని నిలిపి ఉంచేవి ఎన్నో సమిధలు. ఈ సమిధలు - అనంతమైన దుఃఖాన్ని భరించి, 'భగవంతుడు వీరికి ఎందుకు ఇటువంటి భయంకరమైన దుఃఖాన్ని రాసి పెట్టి ఉంటాడు' అని అందరూ మధన పడేంత స్థితిలో ఉంటూ, జవాబు లేని ప్రశ్నలా మనకి కనిపిస్తారు. లౌకికమైన భావనలో వారి  జీవితానికి న్యాయం జరిగినట్టు మనకి అనిపించదు.

నవీన కాలంలో కూడా ఇలాంటి దృష్టాంతాలు మనకి కొన్ని కనిపిస్తున్నాయి -
జీవితంలో ఎన్నో కలలతో ముందుకు అడుగేస్తున్న ఒక బంగారుతల్లి 'నిర్భయ' , ఆరుగురు రాక్షసుల కర్కశత్వానికి అతి దారుణంగా బలి అయ్యింది. తనమీద జరుగుతున్న అన్యాయాన్ని శాయశక్తులా ఎదిరించింది, మృత్యువు అతి దారుణంగా కబళిస్తున్న సమయంలో కూడా ఎదిరించి నిలబడింది. అఖండ భారతావని ప్రజల్లో ఒక ధర్మాగ్రహాన్ని రగిలించి, దేశంలో స్త్రీల రక్షణ కోసం ప్రతి ఒక్కరినీ ఉద్యమించేలా చేసి, తను జీవిత రంగం నుంచి నిష్క్రమించింది. తమ ఆడ బిడ్డలని రక్షించుకోవాలనే విచక్షణని ప్రజలకి కల్పించి ఆసేతు హిమాచల పర్యంతం స్ఫూర్తిని, జాగృతిని వెలిగించిన మహా శక్తి ఆ తల్లి. ఆమెకి జరిగింది గుండె వెయ్యి వక్కలు అయ్యేంత భయంకరమైన అన్యాయమే! కానీ కోటాను కోట్ల ప్రజలను స్త్రీజన రక్షణ కోసం
కరడు కట్టిన జడత్వం నుంచి ధర్మాగ్రహం వైపు నడిపించే యజ్ఞంలో ఆ బంగారుతల్లి సమిధ అయ్యిందేమో ? 

వేలాది మంది చార్ ధామ్ యాత్ర పేరుతో పరమేశ్వరుడి సమక్షంలో తరించాలని ఆశపడి, ఎన్నో కష్ట నష్టాలకి ఓర్చి దేవభూమి అయిన ఉత్తరాఖండ్ కి తరలి వచ్చారు. చూస్తూ చూస్తూ ఉండగానే గంగమ్మ మహోగ్రహ తరంగాలలో జల సమాధి అయ్యారు. నీటిలో కొట్టుకొని పోయిన వారు కొందరు, బురదలో కూరుకుని  ప్రాణాలు విడిచిన వారు కొందరు, కొండల మీద నుంచి దొర్లిన బండ రాళ్ళ కింద చితికి మరణించిన వారు కొందరు, ఆప్తులని కోల్పోయిన వారు కొందరు, అడవులలో అలమటించిన వారు కొందరు, దారుణమైన రీతిలో అంగ వైకల్యం బారిన పడ్డ వారు కొందరు, విష కీటకాల - క్రూర మృగాల భయానక దాడులని తప్పించుకుని గుండెలు అవిసిపోయిన వారు కొందరు, ప్రాణాలు పోయే స్థితిలో కుడా మనిషి మితి మీరిన స్వార్థానికి నివ్వెరపోయిన వారు కొందరు - ఇంత భయంకరమైన జల విలయం ఎందుకు వచ్చింది ? సామాన్య జనులకి తీర్థ యాత్ర ఒక ప్రాణాంతక అనుభవంగా ఎందుకు మారింది ? ప్రభుత్వం కాసుల కోసం ప్రాకృతిక స్వరూపాలని జల విద్యుత్ కేంద్రాల కోసం నామ రూపాల్లేకుండా చేసింది, అది చాలా పెద్ద తప్పు. శివ శక్తుల సహజ సంతులిత శక్తి తత్త్వం తో సుసంపన్నమైన పుణ్య క్షేత్రాలని - చార్ ధామ్ రక్షకురాలైన శక్తి ధారీ దేవిని - అభివృద్ధి పేరుతో సహజ స్థితి నుంచి పక్కకి తప్పించింది, ఇది మహా అపరాధం. అభివృద్ధి పేరిట భారత దేశంలోని దేవ భూమిలో ఈ మహాపరాథాలు జరగడం చూడలేక భూమాత, గంగమ్మ కన్నెర్ర చేశారు. భగవంతుడు చేస్తున్న ధర్మ యజ్ఞంలో ఈ సామాన్యులు ఏ విధమైన పాత్రని నిర్వహించడానికి ఇంత దుఃఖం పొందాల్సి వచ్చిందో ?

ఇది అంతా నా లాంటి సామాన్య మనిషికి అర్థం అయ్యే రీతిలో పరమేశ్వరుని లీలని / భావాన్ని తెలియజేయగల మహానుభావులు ఎవరన్నా తారసపడాలని కనులు కాయలు కాసేలా చూస్తున్నాను. "తీర్థయాత్ర కి వచ్చి మేము ఎన్ని కష్టాలు పడ్డామో" అని దుఃఖంలో వేదన చెందుతున్న ప్రజలకి ఈశ్వరుడి సంకల్పాన్ని / లీలని ప్రకటితం చెయ్యగల వారు ఒకరు రావాలి. హిందూ ధర్మం విస్తృతం అయినది, గంభీరమైనది, అద్భుతమైనది. ఎప్పుడూ సుఖం మాత్రమే ఆశించాలి అని హిందూ ధర్మం బోధించలేదు. సుఖమ్ దుఃఖం రెండిటినీ సమానంగా తీసుకోగల దీరోదాత్తతని హిందూ ధర్మం నేర్పుతుంది. అయితే జ్ఞానం పెద్దగా వికసించని వాళ్ళని - ఇటువంటి సంఘటనలను ఉదాహరణగా చూపించి - పర ధర్మం లోకి వారిని మరల్చగల ప్రలోభపెట్టే శక్తుల ప్రభావం నేడు బలంగా ఉంటోంది. అటువంటి వారి నుంచి అమాయకుల నమ్మకాన్ని రక్షించడానికి నా స్వామి తన దూతని మా మధ్యకి పంపాలి.

తండ్రీ  ! నీ ప్రేమని అర్థం చేసుకోలేకపోయాము, తల్లి ప్రకృతి మాకు ఇచ్చిన జీవనాన్ని మా చేతులతో నాశనం చేసుకున్నాం. మా తోటి జీవులకి మనుగడ  లేకుండా చేశాము. నువ్వు బ్రతకమన్న రీతిలో బ్రతకకుండా వెర్రి తలలు వేశాము. మమ్మల్ని మనస్ఫూర్తిగా క్షమించి కడుపులో పెట్టుకు కాపాడు. నీ పరిపూర్ణ సృష్టి నియమాలను గౌరవిస్తూ, నీ మంగళ కర తత్త్వాన్ని అవగతం చేసుకుంటూ ముందుకు వెళ్ళే వరాన్ని అనుగ్రహించు, మమ్మల్ని కనికరించు !


Tuesday, May 21, 2013

నారాయణుడు - నారాయణి

పరమాత్మ పురుష రూపంలో ఉంటే నారాయణుడు, స్త్రీ రూపం లో సాక్షాత్కరిస్తే నారాయణి (పార్వతీ అమ్మవారు).

- కాంచీపురంలో అమ్మ కాత్యాయని పరమ శివుడి కోసం తపస్సు చేసి, ఈశ్వరుడి పరీక్షని ఉద్ధృత గంగ రూపంలో ఎదుర్కొంటున్నప్పుడు - విష్ణు మూర్తి చెల్లెలికి అండగా నిలబడి, ఆ పరీక్షని చాకచక్యంగా ఎదుర్కొనేలా చేసి - కామాక్షీ ఏకామ్రనాథుల కళ్యాణానికి మార్గం సుగమం చేశాడు.

- మథురైలో మీనాక్షీ సుందరేశ్వరుల కళ్యాణానికి కూడా కర్త నారాయణుడే !

అన్నగారు ఎక్కడెక్కడ వెలిసినా అక్కడ తన స్పర్శని తెలియజేసే తల్లి పార్వతీ అమ్మవారు.

- శ్రీ కృష్ణావతారంలో యశోదా దేవి కడుపున యోగ మాయగా జన్మించి, బాల కృష్ణుడు రేపల్లెకి రాగా తాను దేవకీ దేవి ఒడి చేరి, కంసుడిని హెచ్చరించి, కృష్ణావతార ప్రయోజన ఘట్టాలకు తెర తీసింది సాక్షాత్ పార్వతీ అమ్మవారే !

- శ్రీ కృష్ణుడు అంబికా దేవి ఉపాసకుడు. ఆయన భాగవతంలో చూపిన ప్రతి లీల వెనుక యోగమాయ పార్వతీ దేవి మహాత్మ్యం ఉంది.

- దుర్మార్గులైన రాజులని వధించి భూభారాన్ని తగ్గించడానికి మహా విష్ణువు పరశురామావతారం ఎత్తినప్పుడు, ఆయన జననీ జనకులు అయిన జమదగ్ని మహర్షి, రేణుకా మాత - సాక్షాత్ పరమ శివుడు, పార్వతీ దేవి అంశలే !

ఆ అపురూప బంధం యొక్క దృష్టాంతాలు ఇప్పటికీ మనం కొన్ని క్షేత్రాలలో చూడచ్చు.

- సింహాచల క్షేత్రంలో కొండ కింద పార్వతీ అమ్మవారు పైడిమాంబ రూపం లో కొలువై ఉంది. నరసింహ స్వామి చెల్లెలుగా కొన్ని ఉత్సవాలలో పైడి తల్లి అమ్మవారికి స్వామి నుంచి సారె వస్తుంది. అన్నగారికి లక్ష్మీ దేవిని ఇచ్చి వివాహం చేయించడానికి పైడితల్లి అమ్మవారు, సోదరి సత్తెమ్మ తల్లితో, తమ్ముడు పోతురాజుతో కలిసి పెళ్ళి వ్యవహారానికి వెళ్ళారని సింహాచల భక్తుల నమ్మకం.

- అన్నవరం సత్యన్నారాయణ స్వామిగా మహా విష్ణువు వెలసిన పుణ్య క్షేత్రంలో, వన దుర్గా దేవిగా స్వామి వారి క్షేత్రాన్ని పాలిస్తూ స్వామి సోదరిగా పూజ అందుకుంటున్నారు పార్వతీమాత. 

Sunday, May 5, 2013

హిమజ

తండ్రికి కూతురు బంగారు తల్లి, వరాల మూట.

కూతురు పుట్టిన తర్వాత తండ్రి వ్యక్తిత్వం సమూలంగా మారిపోతుంది. యవ్వనంలో ఉండే ఆగ్రహం,ఆవేశం స్థానంలో విచక్షణ, మెళకువ వస్తాయి. కూతురు ఎదుగుతున్న కొద్దీ తండ్రి ఒక్కొక్క పార్శ్వంలో తనను తను దిద్దుకుంటూ పరిపూర్ణమైన వ్యక్తిగా తనని తాను ఆవిష్కరించుకుంటాడు. తండ్రికి సాక్షాత్తు ఇంకొక జన్మ వంటి పరిపూర్ణ అస్తిత్వాన్ని ఇచ్చేది కూతురు.

సాక్షాత్తు జగన్మాత ని కూతురిగా పొందిన హిమవంతుడి అదృష్టాన్ని ఏమని పొగడగలం ?

తన సంకల్ప మాత్రంతోనే లోకాలన్నిటినీ సృజించగల పరమ శక్తి స్వరూపిణి పసి బిడ్డలా మారి హిమవంతుడి చేతుల్లో బంగారు బొమ్మలా కేరింతలు కొట్టింది. సమస్త ప్రాణి కోటికి అన్నాన్ని ఇచ్చి పోషించి లోకాన్ని నడిపే తల్లి హిమవంతుడి చేతి గోరుముద్దలు తిన్నది. సర్వ లోకులనూ పసి బిడ్డలని చేసి ఆడించే అమ్మ, హిమవంతుడి ఒడిలో పసి బిడ్డ రూపంలో ఆడింది. అనంత సూర్య కోటి ప్రభా సమానమైన వెలుగులని చిందించే అమ్మవారు, హిమవంతుడి కనుల వెలుగుగా ఎదిగింది.

అమ్మవారిని పరమ శివుడికి కన్యా దానం చేసే మధుర క్షణంలో, హిమవంతుడి మనసు ఎంత ఉప్పొంగి ఉంటుందో ? సర్వ లోకాల ఏలిక అయిన పరమ శివుడికే పార్వతి అమ్మవారిని కన్యాదానం చెయ్యగలిగిన తన భాగ్యానికి ఎంత ఉద్వేగాన్ని అనుభవించి ఉంటాడో ? ఎవరిని మించి అధికుడు అనేవాడు విశ్వంలోనే లేడో, అటువంటి పురుషోత్తముడి మామగారిగా తనని పుట్టిన్చినందుకు అమ్మవారిని ఎన్ని రకాలుగా ధ్యానించి ఉంటాడో ?

పార్వతి, హిమజ, హైమవతి - అని తన కుమార్తెగా నామము ధరించి, తనని శాశ్వతంగా  ప్రసిద్ధం చేసి, తన జన్మని ధన్యం చేసిన అమ్మవారి కరుణా రస సాగరంలో మునిగిన హిమవంతుడు ఏమి భావించి ఉంటాడు ? ఆ భావం యొక్క ఉన్నతిని వర్ణించడానికి భాష సరిపోదు.

అందరు లౌకిక మానవుల లాగే ఒక్క మాట మాత్రం అనుకుని ఉంటాడు - "ఈమె నా కడుపున పుట్టిన కుమార్తె కాదు, ఈమె సాక్షాత్తు నను కన్నతల్లి. నాకు మళ్లీ నడకలు నేర్పించి నన్ను సాకడానికి వచ్చిన నా బంగారు తల్లి" అని.  

Wednesday, November 28, 2012

తలంపులమ్మ - లోవ

తలంపులమ్మ - తలుపులమ్మ

ఆంధ్ర ప్రదేశ్ లో, ముఖ్యంగా ఉత్తరాంధ్ర లో దాదాపు ప్రతి వాహనం వెనుక రాసి ఉండే పేరు - తలుపులమ్మ తల్లి. అక్కడ పూజ చేయించిన వాహనానికి ఎలాంటి ప్రమాదం జరగదు అని చాలా మంది నమ్మకం.



తలుపులమ్మ అమ్మవారి ఆలయం ఆవిర్భావం వెనుక ఒక పురాణ కథ ప్రాచుర్యంలో ఉంది. పూర్వం ఒక సారి వింధ్య పర్వతం మేరు పర్వతం తో పోటీ పడి అమాంతంగా తన ఎత్తుని పెంచుతూ వెళ్ళిపోయిందట. ఎంత ఎత్తుకి వెళ్లిందంటే, సూర్య రశ్మి భూమి కి చేరనంత. ప్రాణి కోటి మొత్తం విలవిల లాడిపోయిందట. అప్పుడు దేవతలు అగస్త్య మునిని చేరుకొని ఈ కష్టాన్ని గట్టెక్కించమని ప్రార్థించారు (వింధ్య పర్వతానికి అగస్త్య ముని గురువుగారు). నిత్యం కాశీలో శివ ఆరాధనలో మునిగి ఉండే అగస్త్య మునికి కాశీని విడిచిపెట్టడం ఇష్టం లేదు, కానీ లోక కల్యాణం కోసం మనసు దిటవు చేసుకుని దక్షిణ దేశానికి బయలుదేరారు అగస్త్య మహా ముని. కాశీని విడిచిపెట్టిన బాధ తీర్చుకోవడం కోసం ముని తన యాత్ర పొడవునా ఎన్నో శివ లింగాలను ప్రతిష్ట చేశారు. ఆ శివ లింగాలను ప్రతిష్టించిన స్థలాలు తరువాత అగస్త్యేశ్వర స్వామి క్షేత్రాలుగా ప్రసిద్ధి చెందాయి. అలా దక్షిణ దేశం వైపు వెళ్తూ వింధ్య పర్వతాన్ని చేరారు మహర్షి. వింధ్య పర్వతుడు అమితానందంతో గురువు గారికి వంగి నమస్కారం చేశాడు. అప్పుడు అగస్త్యుడు - తను దక్షిణ భారత దేశ తీర్థ యాత్రలకు బయలుదేరాడని, తను తిరిగి వచ్చే వరకు వింధ్య పర్వతుడు అలాగే వంగి ఉండాలని ఆదేశించాడు. పర్వతుడు గురువు గారి ఆజ్ఞను శిరసావహించాడు. వింధ్య పర్వతాన్ని అలాగే వంచి ఉంచేందుకు అగస్త్యుడు తిరిగి ఉత్తర భారత దేశానికి వెళ్ళలేదు.

అలా అగస్త్య మహాముని నేడు తుని -లోవ ఉన్న అరణ్య ప్రాంతాన్ని దాటుతూ ఉండగా చీకటి పడింది. అంత  కారడవిలో అర్ఘ్యం ఇవ్వడానికి నీరు కానీ, దాహం - ఆకలి తీరే మార్గం కానీ  కనిపించలేదు. అప్పుడు అగస్త్యుడు ఒక చెట్టుకి చేరగిల పడి కూర్చుని ఆది దంపతులని తలచుకోగానే, ఒక వృక్ష సముదాయం మధ్యలో కనులకి దేదీప్యమానం అయిన కాంతి కనిపించింది.



అమ్మవారి వాణి వినిపించింది. "తాను లలితా దేవినని, భక్త రక్షణ కోసం అడవిలో వన దేవత గా సంచరిస్తున్నానని" చెప్పింది. అప్పుడే అమ్మవారు ఒక నీటి ధారని, ఆహారాన్ని అగస్త్య మునికి ప్రసాదించింది. ముని అర్ఘ్యాదులు పూర్తి చేసి ఆహారం స్వీకరించారు. లోకమాతని అక్కడ భక్త రక్షణార్థం కొలువై ఉండమని ప్రార్థించారు. అమ్మ అలాగే ఇప్పుడు ఉన్న స్వరూపంతో అర్చా మూర్తిగా కొలువయ్యారు. తలచుకోగానే ఆడుకున్న అమ్మ కనుక ముని అమ్మవారిని - తలంపులమ్మ - అని కొలిచారు. ఆ పేరు జన బాహుళ్యం వాడుకలో తలుపులమ్మ అయ్యింది.



అలా తలుపులమ్మ గోదావరి, ఉత్తరాంధ్ర ప్రాంతంలో ఎన్నో కుటుంబాలకి ఇలవేలుపు అయ్యింది. అమ్మవారి గుడి ఒక లోయలో రెండు కొండల మధ్య నెలకొని ఉంది, అమ్మవారి స్వయం భూ విగ్రహం గుహలో వెలిసి ఉంటుంది. అక్కడ జలధార (గంగ ధార) మొదలు ఎక్కడో చివర ఎక్కడో ఈ రోజుకి కూడా ఎవరికీ తెలియదు. ఎవరూ ఇంత  వరకూ కనిపెట్టలేకపోయారు. ఆ నీరు తియ్యగా, ఏడాది పొడవునా పారుతూనే ఉంటుంది.

తలుపులమ్మ సత్యం ఉన్న తల్లి. పిలిస్తే పలికే అమ్మ. ఈ రోజుకీ ఆ లోవ అటవీ ప్రాంతంలో సాయంకాలం అయ్యేసరికి జనులు సంచరించరు. అది అక్కడ కట్టుబాటు. అమ్మవారి గుడి సాయం కాలం 5.30 గంటల తరువాత మూసి వేస్తారు. అటు పిమ్మట అమ్మవారు లోయలో వన దుర్గ లాగ తిరుగుతూ ఉంటారు అని అనుకుంటూ ఉంటారు. అమ్మ లీల ఏమిటో తెలిపే సంఘటనలు ఈ రోజు వరకూ జరుగుతూనే ఉన్నాయి.

నవీన కాలంలోనే ఒక జంట వారి అయిదేళ్ళ పాపతో కలిసి అమ్మని దర్శనం చేసుకున్నారట ! తిరిగి కిందకి వచ్చేటప్పుడు బంధు వర్గంతో మాట్లాడుతూ హడావిడిలో వారి పాప గుడి మెట్లు దిగి కొండ కిందకి రాని సంగతి గుర్తించలేదు. గుడి మూసి వేసి పూజారి కూడా కిందకి వచ్చేశారు. అప్పుడు తల్లి బిడ్డ కోసం వెతికి, కానరాక - కంగారు పడుతూ, దుఃఖిస్తూ తమ వాళ్ళు అందరికీ తెలియజేసింది - పసి పాప గుడి మెట్లు దిగి కిందకి రాలేదని. వారు ఎటూ తేల్చుకోలేని అయోమయం లో పడ్డారు. పూజారులు కూడా కట్టుబాటు తప్పి కొండ మీదకి నిషేధిత సమయంలో వెళ్లి తప్పు చేయవద్దని సూచించారు. అందరిలోనూ అనేక ప్రశ్నలు. ఆ తల్లి దండ్రులు రాత్రి మొత్తం క్షణం ఒక యుగం లాగ గడిపారు. ఈ లోపు తెల్లారింది. అమ్మవారి గుడి తెరిచే సమయం అయ్యింది. పసి పిల్ల తల్లి దండ్రులు మెట్లు ఎక్కి లోవ గుడి లోకి పరుగులు తీశారు.



వారి కుమార్తె నవ్వుతూ ఆడుకుంటూ ఎదురు వచ్చింది. తల్లి దండ్రులు పాపని అడిగారు "రాత్రి అంతా భయం వెయ్యలేదా ? ఒక్క దానివే ఎలా ఉన్నావు ? ఆకలి వెయ్యలేదా ?" అని. అప్పుడు పాప చెప్పిందట "అదేమిటి అమ్మా ! నువ్వు మొత్తం రాత్రి అంతా నాతోనే ఉన్నావు కదా. నాకు అన్నం పెట్టావు, నిద్ర పుచ్చావు కదా. నాకు భయం ఎందుకు ?"

ఎప్పుడో మనకి తెలియని పురాణ కాలంలో మాత్రమే కాదు, తలుపులమ్మ - అప్పటికీ ఎప్పటికీ ఎప్పటికీ - తలచుకోగానే వచ్చి అక్కున చేర్చుకుని ఆపదలు బాపే తల్లి. సత్యమున్న తల్లి.

" శ్రీ లలితే నమోస్తుతే !"

Friday, November 2, 2012

హృదయం పావన్ గౌతమీ తటమ్ - 3

దాక్షారామం ...

పంచారామ లింగం, శక్తి పీఠ క్షేత్రం. ఆది దంపతులకి అత్యంత ఇష్టమైన క్షేత్రాలలో (కాశి, శ్రీకాళహస్తి, శ్రీశైలం, ఉజ్జయిని, కాంచీపురం క్షేత్రాల కోవలో) ఇది కూడా ఒకటి. అష్టాదశ శక్తిపీఠ ఆవిర్భావ కథకి వేదిక దాక్షారామం. దక్షుడు యజ్ఞం చేసిన భూమి ఇది.



యజ్ఞంలో పరమశివుడికి హవిస్సు ఇవ్వకుండా చేయ తలపెట్టిన దక్షుడి అహంకారం సమూలంగా తీసివేయబడ్డ భూమి ఇది. శివుడు - అంటే అర్థం శుభం కలిగించే వాడు. శివ దర్శనం శుభకరం, శివ నామ స్మరణ శుభకరం, శివ పూజ శుభకరం, శివ అభిషేకం శుభకరం.

"శివుడు లేకుండా తలపెట్టిన ఎంత గొప్ప పని అయినా దానికి శుభం లేదు" అని పార్వతీ మాత లోకానికి తెలియజెప్పడానికి 'దాక్షాయణి'గా తన శరీరాన్ని విడిచిపెట్టిన స్థలం దాక్షారామం.  

ఇది మాత్రమే కాదు, దాక్షారామం సామాన్య మానవాళికి ఇచ్చే సందేశాలు ఎన్నో -

1) మన దీక్ష ఫలితంగా భగవంతుడు మనని కరుణిస్తే, మరింత జాగరూకతతో వినయంగా వ్యవహరించాలి. ఒక సారి పరమాత్మ దయ వల్ల మనకి జరిగిన మంచిని మన గొప్పతనం అనుకోవడం మొదలుపెడితే పతనం అక్కడే మొదలవుతుంది.

దక్షుడు మొదట ప్రజాపతి అని గర్వించాడు. తన తపోఫలంగా అమ్మవారిని కుమార్తెగా పొందాక ఆమెకి తండ్రిగా సర్వాధికారం తనదే అన్నట్టు ప్రవర్తించాడు. అకారణంగా అల్లుడి వ్యక్తిత్వం గుర్తించక ద్వేషం పెంచుకున్నాడు. అహంకారంతో గౌరవనీయమైన వారిని అవమానించబోయాడు.

2) పరమాత్మకి వ్యతిరేకంగా, అహంకారంతో ప్రవర్తించిన వారికి నాశనం తప్పదు.

3) భార్యకి భర్త పట్ల ఉండాల్సిన ప్రేమని, గౌరవాన్ని పార్వతీదేవి సతీ దేవి రూపంలో చూపించింది.

4) భర్త భార్య పట్ల ఎంత అనురాగంతో ఉండాలో, దంపతులు ఒకరి ప్రాణం ఒకరుగా ఎలా ఉండాలో స్వామి చూపించారు.

కాశీలో సహజ మరణం పొందే వారికి అంత్య కాలంలో, సాక్షాత్ పరమశివుడు చెవిలో ప్రణవ మంత్రాన్ని వినిపించి విశాలాక్షీ గణపతి దేవుల సాక్షిగా తనలో కలిపేసుకుంటాడని సనాతనుల విశ్వాసం. తిరిగి భూమండలం మీద అలా సహజ మరణం పొందే సమయంలో, పరమశివుడు స్వయం గా వచ్చి మంత్రోపదేశం చేసే ఏకైక క్షేత్రం ఒక్క దాక్షారామం మాత్రమే అని అంటారు. జీవుడి శరీరం పడిపోయే సమయంలో దాక్షారామంలో, అమ్మ మాణిక్యాంబ వచ్చి తన ఒడిలో బిడ్డను పడుకోబెట్టుకుని గాలి విసురుతూ ఉంటే, భీమేశ్వరుడు  ప్రణవ మంత్రాన్ని ఉపదేశం చేస్తారట.


దాక్షారామం వద్ద సప్త గోదావరుల సంగమ తీర్థం వద్ద ఉంది. సప్త గోదావరులు అంతర్వాహినులుగా వచ్చి ఆ తీర్థంలో కలుస్తాయి. దాక్షారామం చుట్టు పక్కల అంతా సుభిక్షమైన భూమి, పచ్చని వరి పొలాలతో అన్నపూర్ణగా వర్ధిల్లుతున్న భూమి. సామర్లకోట భీమేశ్వర స్వామి లాగ దాక్షారామ స్వామి కూడా రెండు అంతస్తులలో ఉంటారు. కింద పానపట్టం, శివ లింగంలో కొంత భాగం దర్శనం ఇస్తాయి. అభిషేకాదులు చెయ్యాల్సిన లింగం పై భాగం రెండో అంతస్తులో ఉంటుంది. ఈ క్షేత్రానికి పాలకుడు లక్ష్మీ నారాయణ స్వామి. గుడి లోపలి ప్రాకారం లో అడుగు పెట్టిన వెంటనే కుడి పక్కన లక్ష్మీ నారాయణ స్వామి ఉంటారు. దాక్షారామంలో విశేషం ఏమిటంటే, ఎప్పుడు మాణిక్యాంబ భీమేశ్వర స్వామి కల్యాణం చేసినా, అదే పందిరిలో శ్రీ లక్ష్మీ నారాయణుల కల్యాణం కూడా కలిపి చేస్తారు. ఇద్దరు ఆది దంపతుల కళ్యాణాలు ఒకే పందిరిలో జరుపుతారు - ఇంక ఆ ప్రాంతం సుభిక్షంగా ఉండటంలో ఆశ్చర్యం లేదు.



కింద అంతస్తులో స్వామి లింగానికి ప్రదక్షిణ చేసే మార్గం ఉంటుంది, అంతా చిమ్మ చీకటి గా ఉంటుంది. అక్కడ రాతి గోడల మీద బొడిపెలు ఉంటాయి. పూర్వం అక్కడ వజ్రాలు ధగ ధగ మెరుస్తూ ఉండేవట. వాటి కాంతులలోనే భక్తులు ప్రదక్షిణ చేసేవారట. ఒక కాలంలో దొంగలు ఆ వజ్రాలు దొంగిలించే ప్రయత్నం చెయ్యగా మాణిక్యాంబ అమ్మవారి ఆగ్రహం తో వాళ్ళు శిలలు అయ్యారని, అప్పటి నుంచి వజ్రాలు రాళ్ళు అయ్యాయని చెప్తారు. దాక్షారామ ఆలయం ఒక రాత్రి లో దేవతలు కట్టారని, సుర్యోదయంలోపు పై కప్పులో ఒక చిన్న భాగం పూర్తి చెయ్యలేక వదిలేశారని అంటారు. పై అంతస్తులో స్వామి వారికి ప్రదక్షిణ చేస్తుంటే ఈ అసంపూర్ణం గా వదిలేసిన కప్పు రంధ్రం కనిపిస్తుంది. అక్కడ నుంచి స్వామి ఆలయ శిఖరం చూడడం గొప్ప అనుభూతి. సామర్లకోట స్వామి లాగే దాక్షారంలో కూడా స్వామి తెల్లని స్ఫటిక లింగం. పంచామృత అభిషేకం, సుగంధ ద్రవ్యాల అభిషేకం, పుష్పాలంకారం అన్నీ అత్యద్భుతంగా ఉంటాయి.



దాక్షారామంలో ఉన్న విశేషం ఏమిటంటే గర్భ గుడిలో స్వామి పక్కనే, సతీదేవి విగ్రహం ఉంటుంది. భర్త పట్ల అవ్యాజమైన అనురాగం కల బంగారు తల్లి మా దాక్షాయణి, భర్త గౌరవమే తన ఆభరణంగా మెలిగిన మహా పతివ్రత నా తల్లి దాక్షాయణి.



స్వామి గుడి మెట్లు దిగి వెనుక భాగంలో ఉన్న మండపానికి వెళ్తే అక్కడే శక్తి పీఠ అధినేత్రి మాణిక్యాంబ అమ్మవారు కొలువై ఉంటారు. అమ్మ మూర్తి బహు తేజోమయంగా ఉంటుంది. నాలుగేళ్ల పసి బిడ్డ నగుమోముతో మనం ముందు కూర్చున్నట్టు ఉంటుంది.

మా నాన్నగారు, పెదనాన్న గారు స్వయంగా స్వామి కి అభిషేకం, అమ్మవారికి కుంకుమ పూజ చేసుకునే అదృష్టాన్ని పొందారు. ఆ రోజు దాక్షారామం లో దిగిన దగ్గర నుంచి తిరిగి దాక్షారామం వదిలి వచ్చే వరకు, సన్నని తుంపర మమ్మల్ని తాకుతూనే ఉంది. నిరంతరం స్వామి ఝటాఝూటంలో పొందికగా ఒదిగి ఉండే ఆకాశ గంగమ్మ, స్వామి అమ్మవార్ల దర్శనానికి వచ్చిన మమ్మల్ని ఆనందంతో ఆహ్వానిస్తూ, ఆశీర్వదిస్తున్నట్టు నాకు తోచింది. చుట్టూ రెండు ప్రాకారాల మధ్యలో ఠీవిగా నిలబడ్డ అతి విశాలమైన దాక్షారామ ఆలయం, ఉపాలయాలు, అక్కడ నేల, చెట్టు చేమలు, పుట్టలు, శిల్పాలు, రాళ్ళు రప్పలు - అన్నిటినీ అభిషేకిస్తోంది ఆకాశ గంగమ్మ, మాతోపాటుగా. ఆ క్షణం నా చుట్టు పక్కల అన్నిటిలో మాత్రమే కాదు, నా లోపల కూడా పరమ శివుడే ఉన్న భావన... అణువు అణువునా  ఉన్న పరమశివుడికి జలాభిషేకం జరుగుతోంది అక్కడ.



లోపల ప్రాకారం నుంచి మొదటి ప్రాకారం మధ్యలో ఉన్న అశ్వత్థ నారాయణ వృక్షం దగ్గరకు వచ్చాము. భీమేశ్వర స్వామి గర్భ గుడి నుంచి బయటకు వచ్చి రెండు ప్రాకారాల తలుపులు దాటి సప్త గోదావరీ తీర్థానికి వెళ్ళే మార్గం లో - రెండు ప్రాకారాల నడుమ వున్న అతి విశాలమైన ప్రాంగణంలో - ఈ వృక్షం ఉంది, ఆ వృక్షం మొదలులో శివ నారాయణుల మూర్తులు ఉన్నాయి. వృక్షం మొదలులో చుట్టూ అనేక నాగ శిలలు ప్రతిష్ట చేసి ఉన్నాయి. సప్త గోదావరీ తీర్థం లో ఉన్న నీటితో శివ కేశవులని అభిషేకించడం అత్యంత పుణ్య దాయకం. తీర్థం నుంచి అభిషేకానికి నీరు తీసుకు వస్తుంటే,ఒడ్డున ఉన్న ఒక మంటపంలో, అతి నిరాడంబరంగా సాదాసీదాగా ఉన్న ఆహార్యంతో ఒక తల్లి చేతిలో లలితా సహస్ర నామ పుస్తకంతో ధ్యానం చేసుకోవడం గమనించాను. ఇంటిలో లౌకిక వ్యాపారం ముగించి వచ్చి, అమ్మవారి ధ్యానం చేసుకుంటున్నట్టుగా ఉంది ఆ తల్లి. ఆమెను అర గంట క్రితం  మాణిక్యాంబ అమ్మవారి గుడిలో స్తంభానికి చేరగిలబడి, చుట్టూ పరిసరాలతో సంబంధం చేకుండా సాధన చేస్తూ ఉండగా చూశాను. ఎందుకో ఆ తల్లిని చూడగానే హిమాలయాలలో ఏకాగ్ర చిత్తంతో తపస్సు చేసుకునే మహర్షులు గుర్తుకు వచ్చారు.

అశ్వత్థ నారాయణ వృక్షం నుంచి కాల భైరవ స్వామి గుడికి వెళ్లి ఆయనను దర్శించుకోగానే, అమ్మ మాణిక్యాంబ గుడి ప్రాంగణం లో జరుగుతున్న అన్నదానంలో మాకు ఆప్యాయంగా ప్రేమగా భోజనం తినిపించింది. ఎక్కడ అన్నదానం జరుగుతుందో, అక్కడ శాంతి ఉంటుంది. ఎవరన్నా ఎక్కడన్నా అన్నదానంలో తినడానికి కూర్చున్నప్పుడు చెయ్యాల్సిన మొదటి పని -

"అన్నపూర్ణే ! సదా పూర్ణే ! శంకర ప్రాణ వల్లభే
 జ్ఞాన వైరాగ్య సిద్ద్యర్థం భిక్షామ్దేహిచ పార్వతీ
 మాతా చ పార్వతీ దేవీ పితాదేవో మహేశ్వరః
 బాన్ధవాః శివ భక్తాశ్చ స్వదేశో భువనత్రయమ్"

కడుపు నిండా తిని లేచాక చెయ్యాల్సిన మొదటి పని -

"అన్నదాతా సుఖీభవ ! అన్నదాతా సుఖీభవ ! అన్నదాతా సుఖీభవ !"

మన క్షేత్రాలలో నిత్య అన్నదానాన్ని మొదలుపెట్టి నిర్విఘ్నంగా కొనసాగిస్తున్న యజ్ఞంలో ప్రత్యక్షంగా, పరోక్షంగా భాగస్వాములు అయిన ప్రతి ఒక్కరికీ శుభం కలుగుగాక !

దాక్షారం గుడిలో దర్శనం అయ్యాక బయటకు వచ్చిన వెంటనే ఎడమ పక్కన సప్త గోదావరీ తీర్థం ఒడ్డున ఒక పురాతన ఆలయం ఉంది. అక్కడ పరమేశ్వరుడు సర్వమంగళా దేవి సమేతం గా కొలువై ఉన్నాడు. మెడలో ప్రస్ఫుటం గా కనిపించే మంగళ సూత్రాలతో స్వామి పక్కన కూర్చుని ఉన్న మా సర్వ మంగళాదేవిని - మంగళములకే మంగళము అయిన మా తల్లిని - చూడగానే లోలోపల ఇది అని చెప్పలేని ఒక పులకరింత, కళ్ళలోనూ - మనసులోనూ - దేహం లోనూ - ఆలోచనలోనూ ఏదో సంతృప్తి.

అక్కడ నుంచి నేను ఎన్నో రోజుల నుంచీ కళ్ళు కాయలు కాసేలా ఎదురు చూస్తున్న దక్ష గుండానికి వెళ్ళాము. గుడికి ఫర్లాంగు దూరంలో, కోటిపల్లి రోడ్డులో విజయా సినిమా హాలు పక్కన, పెద్దగా దృష్టికి అందని ఒక తోటలో ఉంది ఈ దక్ష గుండం. గేటు నుంచి లోపల ఇరుకైన దారిలో ఒక పావు కిలోమీటరు నడిస్తే, చెట్టు చేమలు నీటి ధారల మధ్య ఒక ఆలయం, పక్కన చిన్న కొలను ఉన్నాయి.

ఆ కొలను ఒకప్పుడు దక్ష యజ్ఞం జరిగిన దక్ష గుండం. కిందకి మెట్లు దిగి కొలను ఒడ్డుకి వెళ్లాను. కొలను మధ్యలో దాక్షాయణి విగ్రహం నిలిపిన చిన్న మందిరం ఉంది. కొలను ఒడ్డు నుంచి మందిరానికి చిన్న చెక్క బల్ల వేశారు. దాని మీద నడిచి వెళ్లి దాక్షాయణి అమ్మ పాదాలకి మొక్కాను. తిరిగి వెనక్కి వచ్చేశాను. ఒక్క సారి వెనక్కి తిరిగి చూశాను. శరీరం అంతా విద్యుత్తు పాకిన అనుభూతి. ఒక్కసారిగా కళ్ళలో నీళ్ళు తిరిగాయి ... ఇది బాధా, సంతోషమా ? గొప్ప పురాణ గాథకి వేదికగా నిలిచిన ప్రదేశంలో నేను ఉన్నాను అనే సంతోషమా ? లేక నా తండ్రి పరమశివుడు దూషించబడగా అమ్మ దాక్షాయణి మనసు కలచివేయగా ఆమె ఆత్మాహుతి చేసుకున్న ప్రదేశం ఇది అనే బాధా ? అమ్మ దుఖం ఒక్క సారిగా నా మనసుని ఆవరించింది.

పక్కనే దాక్షాయణి ప్రాణ త్యాగం చేసిన ప్రదేశంలో అవతరించిన ఘట్టాంబికా దేవికి నమస్కరించి దక్ష గుండం నుంచి వెనక్కి తిరిగాము. ఇక్కడితో దాక్షారామ యాత్ర ముగిసింది, సంభ్రమాశ్చర్యాల నడుమ ఇంకొక పుణ్య క్షేత్ర దర్శనానికి నాందిగా ...

స్వయంభూరస్తి భీమేశః మాణిక్యాంబా తథైవచ
సప్తర్షి భి స్సమానీతం సప్త గోదావరం శుభం
సూర్యేణ సేవితః పూర్వం భీమేశో జగదీశ్వరః
భక్త రక్షణ సంవ్యగ్రా మాణిక్యా దక్ష వాటికే

హృదయం పావన గౌతమీ తటమ్ - 2

పీఠికా పురం - పిఠాపురం
ఇది దేవ భూమి. ఇక్కడి ప్రతి అణువు దైవం నడయాడిన పవిత్ర భూమి.



పిఠాపురం లో మొదట శ్రీ పాద వల్లభ సంస్థానానికి వెళ్ళాము. ఇప్పటి వరకు దత్తాత్రేయ స్వామి మొదలుకొని షిర్డీ సాయిబాబా వరకు ఉన్న గురు పరంపర లో, శ్రీ పాద వల్లభ స్వామి అవతారం విశేషం అయినది. పిఠాపురం లో దత్తాత్రేయ అంశగా ఒక పుణ్య దంపతులకి జన్మించి, గురు స్వరూపమై ఎందరో సామాన్యులను ఉద్ధరించి, వేదోక్తమైన జీవనాన్ని - ధర్మాన్ని నిలిపి, జీవుల కర్మలను బాపి, గానుగా పురం లో నివశించిన స్వామి ఆయన. స్వామి జన్మించిన ఇల్లు ఇప్పటి మహా సంస్థానం. ఆ సంస్థానం లో ఉచిత వసతి, నిత్య అన్నదానం జరుగుతూ ఉంటాయి. ఆయన నీడలో ఎందరో దుఃఖం అనే మాటని పూర్తి గా మరచి ఆనంద సముద్రం లో ఓలలాడుతున్నారు. అక్కడ కొన్ని గంటలు ప్రశాంతత పరుచుకున్న వాతావరణం లో గడిపాము. అక్కడ ఔదుమ్బర వృక్షానికి ప్రదక్షిణ చేశాము.




 అక్కడ నుంచి పంచ మాధవ క్షేత్రాలలో  ఒకటి అయిన కుంతీ మాధవ స్వామి ఆలయానికి వెళ్ళాము. అతి ప్రాచీనమైన అద్భుతమైన గుడి అది, యుగ యుగాల నాటి ఆలయం అది.

"అధరం మధురం నయనం మధురం
వదనం మధురం వచనం మధురం
చరణం మధురం మధురమే మధురం
శ్రీ మధురాధిపతే అఖిలం మధురం"



అక్కడి నుంచి స్వయంభూ కుక్కుటేశ్వర స్వామి, పురుహుతాంబ శక్తి పీఠం, స్వయంభూ దత్తాత్రేయ మూర్తి ఉన్న పాద గయా క్షేత్రానికి వెళ్ళాము. స్వయం గా ధర్మ పరుడైనా తన వర్గం లోని వ్యక్తుల అధర్మ వర్తనాన్ని ప్రోత్సహించినందుకు, పాప పుణ్యాల ధర్మ చక్ర మార్గానికి అడ్డుగా నిలిచినందుకు త్రిమూర్తులచే  శిక్షింప బడిన గయాసురుడు - శిరో గయ (అధిదేవత విష్ణువు, మంగళ గౌరీ శక్తి పీఠం), నాభి గయ (అధిదేవత బ్రహ్మ, విరజా దేవి శక్తి పీఠం), పాద గయ (అధిదేవత శివుడు, పురుహూతికా శక్తి పీఠం) -  అనే మూడు క్షేత్రాల రూపం లో పూజనీయుడు అయ్యాడు. పాద గయా క్షేత్రం లో ఉన్న సరోవరం లో గయుడి పాదాలు ఉన్నాయని నమ్మకం. ఆ పవిత్ర కోనేటి నీటిని తలపై చల్లుకుని పురుహూతికా అమ్మ గుడి లోకి అడుగుపెట్టాము.



అమ్మ దేదీప్యమానం గా వెలుగుతోంది. అమ్మ తేజస్సు కనుల నిండా, మనసు నిండా పరుచుకుంది. సంధ్యా సమయంలో , దీప కాంతులలో అమ్మ కనులు, వంపులు తిరిగిన కను రెప్పలు, ముక్కెర, బేసరి - ధగ దగా కాంతులు చిమ్ముతున్నాయి. మా అమ్మ, పెద్దమ్మలు లలితా సహస్ర నామ పారాయణం చేశారు, ఈ జగజ్జననిని చూస్తూ - ఎదురుగా కూర్చుని. గంటలు గడిచాయి, అమ్మ ప్రేమ పూరితమైన దర్శనం గంటలను కరిగించేస్తోంది.

ఎన్నో రోజుల నుంచి నాలో అహంకారం జడలు విప్పుకుంది, పురుహూతికా అమ్మవారి విశిష్టత గురించి కొంచెం తక్కువగా ఆలోచించే అజ్ఞానం నాలో పాతుకు పోయి ఉంది. పిఠాపురం లో పురుహూతికా అమ్మవారి తేజస్సు భరించలేక అమ్మ వారి విగ్రహం భూమి లో దాచేశారని, ఇప్పుడు ఉన్న విగ్రహం నవీన కాలం లో ప్రతిష్ట చేసారని ఎక్కడో చదివాను. ప్రపంచం లో ప్రతి అణువులోనూ అమ్మ నిండి ఉందన్న సత్యాన్ని గ్రహించి, అమ్మ ముందు మంచి పుత్రుడి గా ఉండాల్సిన నేను వక్రం గా ఆలోచించాను. స్వయంభూ విగ్రహం కాని ఇప్పటి అమ్మవారి మూర్తి నా '(అ)జ్ఞానానికి' ఆనలేదు (అమ్మా! ఇలాంటి భావన చేసినందుకు నా లాంటి మూర్ఖుడిని క్షమించు). ఒకింత నిర్లక్ష్య భావన అప్పుడప్పుడు జడలు విప్పుతూ ఉండేది. కానీ, ఇప్పుడు ఈ రోజు మళ్లీ మళ్లీ అమ్మ తేజోమయ రూపం మనసు ని లాలిస్తోంది. ఎన్ని గంటల పాటు అయినా కను రెప్ప వెయ్యకుండా చూడాలనిపించే పురుహూతాంబ రూపం మిగతా అన్నిటినీ మరిచిపోయేలా చేస్తోంది. మునుపు రెండు సార్లు అమ్మ వారిని చూసినా కూడా నాకు ఇప్పుడు తాదాత్మ్యత ఎక్కువగా అనిపిస్తోంది.



అక్కడే వెలిసిన కుక్కుటేశ్వర స్వామిని, హూంకారిణి దేవిని (ఈ అమ్మ హూంకారం తో రాక్షస సంహారం చేసిందట), రాజ రాజేశ్వరీ దేవిని (కుక్కుటేశ్వర స్వామి వారి దేవేరి), గణపతిని  దర్శించి దత్తాత్రేయ స్వామి దగ్గరికి వెళ్ళాము. అక్కడ పూజారి గారు నేను అడగకుండానే పురుహూతికా శక్తి పీఠం గొప్పతనాన్ని నాకు వివరించారు (అమ్మకి నా అజ్ఞానాన్ని తుడిచి వెయ్యాలనే సంకల్పం కలిగిందేమో!)


సతీ దేవి శరీర భాగాలలో పీఠ భాగం పడిన క్షేత్రం ఈ పిఠాపురం.

అమ్మ పీఠ భాగాన్ని చూడడం నిషేధం కాబట్టి  అమ్మ ధ్యానరూపాన్ని విగ్రహంగా మలిచి గుడిలో నిలిపి పూజలు  చేస్తున్నారు. ఇప్పటికీ అమ్మవారి పీఠం భూమి లోపల, భూమికి సమాంతరంగా కనీసం అర కిలోమీటరు విస్తరించి ఉందట. పిఠాపురం ఊరి మధ్యలో ఉన్న గ్రామ దేవత ఆలయం వరకు బ్రహ్మాండంగా విస్తరించి ఉందిట. యోగులు, శక్తి  ఉపాసకులు అమ్మవారిని కొలవడానికి జ్ఞాన నేత్రంతో అమ్మవారిని దర్శించగలరు. సామాన్య జనుల కోసం ఈ రోజు అమ్మ వారి శక్తి పీఠ ఆలయం, మూల మూర్తి  సరళంగా ఇలా దర్శనం ఇస్తున్నాయి.


బ్రహ్మాండం అంత అమ్మ వారి చైతన్యం మనసు మొత్తం నింపి వెయ్యగా, ఆత్మ అంతా అమ్మవారి కోసం తపిస్తూ ఉండగా - అక్కడ కాశీ విశ్వేశ్వర స్వామి అన్నపూర్ణాంబ, కాల భైరవ స్వామి, సుబ్రహ్మణ్య స్వామి, దుర్గా దేవి ఆలయాలు చూశాము. దుర్గాంబ ఆలయం దగ్గర దీపారాధన చేశాము. అది సోమవారం, ఆది దంపతులు పాద గయలో విహారం చేస్తూ అక్కడ చాల మంది భక్తులు వెలిగించిన దీపపు కాంతులలో మెరిసిపోతున్నట్టుగా ఉంది. నా లాంటి మంచు కమ్మిన మనిషి లోపల వెచ్చని వెలుగు వ్యాపిస్తున్నట్టు అనిపించింది. పున్నమి చంద్రుడి కాంతిలో, లేత చల్ల గాలుల స్పర్శలో దీపం నిర్మలం గా ప్రకాశిస్తోంది ...  చెవుల నిండా శ్రావ్యం గా వినిపిస్తున్నాయి - "ఓం నమశ్శివాయ ఓం నమశ్శివాయ ఓం నమశ్శివాయ ఓం నమశ్శివాయ ఓం నమశ్శివాయ ఓం శ్రీ మాత్రే నమః" !